Notice Board
Saturday, 16 May 2015
Wednesday, 13 May 2015
Sir Arthur Cotton Jayanthi
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జ.మే 15, 1803 ఆక్స్ఫర్డ్ - మ.జూలై 24,1899 డోర్కింగ్) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు
నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం
మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయినది. కాని ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.
1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు.
1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్
ధర్మోపదేశకురాలుఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.
ఉభయగోదావరిజిల్లాలు-కాటన్
పవిత్ర జీవనది కి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు
అతివృష్టి వలన, వరదముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో
విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో
అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు.
అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో
కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల,
ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న
గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో
నిలచిపోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో
స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
అని పఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు.ఉభయగోదావరి జిల్లాల లోని చాలా
గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే
విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్సైజు కాటన్
విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి
ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా
అభివృద్ధి పరచి, ధృడంగా చేయబడి కట్టబడినది.
కృషి
కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయం లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లా లను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్
నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే
కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ
తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను
పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది.
తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు
కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు.
కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దే. ఇంతేకాక ఆయన
బెంగాల్, ఒడిసా , బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి
ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు,
బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.
కాటన్మ్యూజియం
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు
ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం.ఈ మ్యూజియంను
ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా
ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది.
రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడినది. భవనంచుట్టూ ఆవరణలో
పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి.మ్యూజియం ఆవరణమీదుగా,మ్యూజియం
భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెన ఉన్నది.
ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి
పురాతన యంత్రాలు(రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు
యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు.ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు
పిరంగులను ఉంచారు.మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన
వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన
చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు
వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రి నుండి,
సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట
నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై
అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు,
కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో
కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియంను సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన
చిత్రము ఉన్నది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల
చిత్రాలు, కాటన్ బస్ట్సైజు విగ్రహం ఉన్నాయి.మ్యూజియం బయట అవరణలో
గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు.
విచారించదగ్గ విషయమేమంటే,ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం.
ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి
చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా
లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్
లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు
రంగువెలసి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని ఊళ్ల లో
విగ్రహాలు పెడుతున్నారు. కాని పాలకులే .....
| సంవత్సరము | కాటన్ జీవిత విశేషాలు |
| 1803 | ఇంగ్లాండులోని కేంబరుమిర్ ఏబీలో హెన్రికాటన్ దంపతులకు 10వ కుమారునిగా జన్మించాడు. |
| 1818 | క్రాయిడన్ వద్ద ఆడిస్కొంబో సైనికశిక్షణాలయంలో కాడెట్ గా చేరిక |
| 1819 | సెకండ్ లెప్టినెంట్ అయ్యాడు. |
| 1820 | వేల్సులో ఆర్డినెన్సు సర్వేకు వెళ్లెను |
| 1821 | బ్రిటిష్ ఇండియా ఉద్యోగిగా భారత్ కు సముద్ర ప్రయాణము. |
| 1822 | పాంబన్ జలసంధిని లోతుచేయు పనిలో సదరన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిక |
| 1824 | బర్మా పై యుద్ధసమయంలో సైన్యంలో చేరెను |
| 1827 | మద్రాసులో తటాక విభాగం సూపరెండెంట్ ఇంజనీరుగా పనిచేసెను. తరువాత పాంబన్ జలసంధిని లోతుచేయుపనిలో నియుక్తుడయ్యెను. |
| 1828 | కెప్టెను హోదాను పొందెను |
| 1828-29 | కావేరి సమస్యపై పరిష్కారానికై ప్రయత్నం మొదలు పెట్టెను |
| 1830 | రెండున్నర సంవత్సరాలు సెలవు పై ఇంగ్లాండు వెళ్ళెను. |
| 1832 | సెలవు తరువాత వచ్చి, కావేరి పనులు చేపట్టెను. కాని మళ్లీ అనారోగ్యకారణంచే ఇంగ్లాండు వెళ్లిపోయాడు. |
| 1837 | మద్రాసు నౌకాశ్రయ నిర్మాణకార్యక్రమము ప్రారంభించాడు. |
| 1840 | కృష్ణానదిపై ఆనకట్ట సాధ్యమేనని నివేదిక సమర్పించాడు. |
| 1841 | ఆస్ట్రేలియాకు ప్రయాణం. ఎలిజెబెత్ తో 29-10-41 న పెళ్ళి |
| 1843 | భారత్ కు తిరిగివచ్చెను. |
| 1846 | గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్టకు లండను డైరక్టర్లనుండి ఆమోదం లభించినది. |
| 1847 | ఏప్రిలు లో గోదావరినదిపై ఆనకట్ట పనులు ప్రారంభం. |
| 1848 | కృష్ణానది ఆనకట్ట పునాదుల త్రవ్వకం పనులపై సలహలిచ్చెను. |
| 1848 | కెప్టెను ఆర్కు ఆనకట్ట పనులప్పగించి, ఆరోగ్య కారణాలపై ఆస్ట్రేలియా వెళ్ళెను |
| 1850 | భారత్ కు వచ్చెను. వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించినది. |
| 1852 | గన్నవరం అక్విడక్టు పనులు ప్రారంభం. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి. |
| 1860 | పదవీ విరమణ పొంది ఇంగ్లాండుకు వెళ్లిపోయెను.'సర్'బిరుదు ప్రదానం జరిగినది. |
| 1863 | మరల భారత్ కు వచ్చి సోన్ లోయలోని ప్రాజెక్టులకు సలహాలనిచ్చెను |
| 1877 | కె.సి.ఎస్.ఐ.బిరుదు ఇవ్వబడెను |
| 1899 | ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసెను. 96సం.2నెలలు జీవించాడు. |
| సంవత్సరము | కాటన్ జీవితంలోని మైలురాళ్లు |
| 1826-29 | పాంబన్ జలసంధి అభివృద్ధి |
| 1836-39 | తాంజోర్ జిల్లాలోని కావేరి డెల్టా అభివృద్ధి, కోలెరోన్ ఆనకట్ట నిర్మాణము |
| 1836 | మద్రాసు హర్బరు పథకము అమలు |
| 1837 | మద్రాసు నుండి రెడ్హిల్సు వరకు రైలుమార్గం నిర్మాణపనులపై పర్యవేక్షణ |
| 1838-40 | విశాఖ నౌకాశ్రయ నిర్మాణ ప్రాజెక్టు పని. దేశంలోనే ప్రముఖ రేవుగా నేడు ఆవిర్భవించినది |
| 1843-52 | ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య గోదావరి పై ఆనకట్ట నిర్మాణము |
| 1852 | గన్నవరం అక్విడక్టు నిర్మాణం |
| 1856 | కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంపై నివేదిక సమర్పణ |
| 1859 | ఒడిసా ప్రభుత్వానికి నీటిపారుదల పై నివేదిక తయారుచేసి సమర్పించాడు |
| 1878 | తుంగభద్ర కాలువల నిర్మాణము. ఉత్తరభారతంలోనినదులను దక్షిణభారత నదులతో అనుసంధానంపై నివేదిక |
Subscribe to:
Comments (Atom)
